మా ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్: కర్నూలు ఎంపీ డా. సంజీవ్ ‌కుమార్ సంచలన ప్రకటన

  • నా తండ్రికి, సోదరుడికి పాజిటివ్
  • కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స
  • ప్రజలు ఆందోళన చెందవద్దన్న ఎంపీ
తన కుటుంబ సభ్యుల్లో ఆరుగురికి కరోనా వైరస్ సోకిందని కర్నూలు ఎంపీ డాక్టర్‌ సంజీవ్ ‌కుమార్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, స్థానిక నర్సింగరావు పేటలో ఉన్న తన సోదరుల ఇంట్లోని వారికి వ్యాధి సోకిందని, వీరందరూ ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

వీరిలో తన తండ్రి, సోదరుడు కూడా ఉన్నారని, వ్యాధి సోకిన వారంతా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని చెప్పారు. కోవిడ్‌ ఆసుపత్రిగా మారిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలూ ఉన్నాయని తెలిపారు. కర్నూలు ప్రాంతంలో కరోనా మహమ్మారి విజృంభణ అధికంగా ఉందని, కేసులు పెరుగుతున్నాయని మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావించిన ఆయన, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

అమెరికా, స్పెయిన్‌ తదితర దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉండటాన్ని చూసి ఇక్కడి వారెవరూ భయపడవద్దని, మన దేశంలో బీసీజీ వ్యాక్సిన్‌ వాడుతుండటం వల్ల ప్రజల రోగ నిరోధక శక్తి అధికమని తెలిపారు. యూఎస్ వంటి దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి ఇక్కడ రాదని అంచనా వేశారు. రెడ్ జోన్ లు అమలు అవుతున్న ప్రాంతాల్లో లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని, కేసులు నమోదు కాని గ్రీన్‌ జోన్లలో మాత్రం దశల వారీగా నిబంధనలను ఎత్తివేసే అవకాశాలున్నాయని తెలిపారు.

Sanjeev Kumar
MP
Kurnool
Corona Virus
Positive

More Telugu News